

వీ(ళ్ల)డి పౌరుషం ముందు సింహం కూడా పరారే
-రాజకీయ కుట్రలకు, అక్రమ కేసులకు బలైన బోయలు
- అసెంబ్లీ సాక్షిగా బోయలను ఎస్టీలుగా గుర్తిస్తామని సీఎం కేసీఆర్ అబద్ధపు మాటలు
- గిరిజనుల రిజర్వేషన్ల పెంపు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగాట
కనకపు సింహాసనం మీద సింహం కూర్చుండబెడితే అందరికీ వణుకే కదా! అందుకే వీరికి ఎస్టీ హోదా దక్కకుండా అడ్డుపడుతున్నాయి కొన్ని దుష్ట శక్తులు. ఒకప్పటి గ్రామ రక్షకులు(తలారీలు), క్రూర మృగాల నుంచి పల్లకీల పయనించే రాజులను, రాణులను కాపాడిన రక్షక భటులు(కట్టప్పలు), రాయలసీమ రెడ్లకు రైట్ అండ్ లెఫ్ట్ గా నిలిచిన(ఫ్యాక్షనిస్టులు), చదువు సంధ్యలేని అమాయక బోయలను ఎస్టీ లేదా ఎస్సీలుగా గుర్తిస్తామని చెప్పి నేడు రాజకీయ నాయకులకు బాడీగార్డులుగా, పాలేరుల కంటే హీనమైన దుర్భర జీవితం గడుపుతున్నారు ఈ జాతి ప్రజలు. అలా వంచించబడ్డారు నేటి పాలకుల చేతిలో వీళ్లు. మన రెండు తెలుగు రాష్ట్రా(తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)లలో సుమారు కోటి మంది దాక ఉన్న బోయల అసలు జనాభా లెక్కలు బయటకు చెప్పడానికి భయపడుతున్నాయి. వీరి జనాభా పేపర్ల మీద అంతా దొంగ లెక్కలే చూపిస్తారు. ఈ ప్రాచీన అడవి తెగకు చెందిన వాల్మీకి బోయల అసలు జనాభా కోటిపైమాటే అట. ఇటు దక్షిణ, అటు ఉత్తర భారతదేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో బ్రతుకు జీవుడా అంటూ కాలం వెల్లదీస్తున్నారు. బోయలకిచ్చిన హామీ నెరవేర్చి, ఒకప్పుడు అడవిలో వేటనే వృత్తిగా జీవిస్తున్న ఈ జాతి వృత్తిని మంటగలిపి… అడవుల నుంచి దూరంగా తరిమేసి… వారికి నోటికాడి ముద్ద లాక్కొని మైదాన ప్రాంతాల్లోకి బలవంతంగా నెట్టివేయబడ్డ జాతి ఇది. ప్రస్తుతం ఏ వృత్తి పడితే అది చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. నిజాలను దాచిపెడుతున్నాయి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు. తెలంగాణ ప్రభుత్వం డా. చెల్లప్ప కమిటీ వేసి బోయల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవన విధానాన్ని అధ్యయనం చేసి ఆ నివేదికను అసెంబ్లీలో ఆమోదం చేసుకొని కేంద్రానికి పంపకుండా ముడ్డికింద వేసుకొని కూర్చోంది కేసీఆర్ ప్రభుత్వం. అది ఇప్పటివరకు బయట పెట్టలేదు. ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ గత ప్రభుత్వం ప్రొఫెసర్ డా. సత్యపాల్ కమిటీ వేసి బోయల గురించి అధ్యయనం చేసి ఆ నివేదికను మంత్రి వర్గంలో ఆమోదించి కేంద్రానికి పంపినా తొక్కి పెట్టేశారు. ఇప్పటి జగన్ ప్రభుత్వం ఎన్నికల్లో పలుసార్లు ప్రస్తావించి నేడు పదవిలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదు. ఇప్పుడిప్పుడే ఒక తాటికి మీదకు వచ్చి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏవిధంగా ముందుకు పోతే ఎస్టీ హోదా తిరిగి సాధించుకోగలం అని రెండు తెలుగు రాష్ట్రాల్లో వాల్మీకి బోయలు భవిష్యత్తు కార్యాచరణతో ముందుకు రాబోతున్నారు. ప్రతి ఎన్నికలప్పుడు ఇదే తంతు హామీలు ఇవ్వడం… పట్టించుకోకపోవడం. కేంద్రంమంత్రి కిషన్ రెడ్డి తాజాగా రాష్ట్ర ప్రభుత్వాలకే ఎస్సీ, ఎస్టీలో చేర్పులు, కూర్పులు చేసుకోవడానికి అవకాశం ఇచ్చామని గిరిజన రిజర్వేషన్ల పెంపు విషయంపై మాట్లాడుతూ అన్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి బిల్లు పంపామని మహిళా, శిశు మరియు గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు. ఈసారి అలా జరగకుండా ఎస్టీల రిజర్వేషన్ లను జనాభా దామాషా ప్రకారం పెంచి ఆ సర్టిపికెట్ చేతిలో పెట్టినంకనే బోయల ఓట్లు, గిరిజనుల ఓబ్లు పడతాయని అంటున్నారు సంఘం నాయకులు. దీన్ని బట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకంగా మారనుందని అంటున్నారు విశ్లేషకులు.