

తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాల బోయ వాల్మీకులు ఎస్టీ హోదా కోసం మరోసారి జెండా ఎత్తారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. అందుకని రేవంత్ సర్కార్ బోయలను ఎస్టీలుగా గుర్తించడానికి కేంద్రానికి లేఖ పంపాలని బోయలు కోరుతున్నారు
ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ వాల్మీకి బోయల ఎస్టీ అంశాన్ని కేంద్రానికి నివేదించండని ఆ రాష్ట్ర సి.ఎస్.ను ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు కోరారు.
వాల్మీకి బోయల చిరకాల వాంచ అయిన ఎస్టీ. జాబితాలో చేర్చే అంశంపై సాధ్యమైనంత త్వరగా కేంద్రానికి సానుకూల నివేదిక పంపాలని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కు విజ్ఞప్తి చేశారు. జనవరి 31, 2025న విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఆయన సి.ఎస్.తో సమావేశమై ఈ విషయంపై చర్చించారు. దశాబ్దాల కాలంగా వాల్మీకి బోయలు ఎస్టీ సాధన కోసం అనేక పోరాటాలు చేస్తున్నారన్నారు. న్యాయమైన బోయల కోర్కెను తీర్చడానికి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో ప్రయత్నించారన్నారు. అందులో భాగంగా 2017 డిసెంబరులో రాష్ట్ర శాసనసభ ద్వారా తీర్మాణం చేయించి కేంద్రానికి పంపారని గుర్తుచేశారు. తరువాత కేంద్రం కొన్ని వివరాలను కోరగా, వాటికి సమాధామివ్వాల్సిన జగన్ ప్రభుత్వం అనవసరంగా ప్రాంతీయ విభేదాలను సృష్టించి కేవలం రాయలసీమ జిల్లాల వాల్మీకి బోయలను ఎస్టీ. లుగా గుర్తిస్తే సరిపోతుందని ఒక తప్పుడు నివేదికను కేంద్రానికి పంపి సమస్యను మరింత జటిలం చేసిందన్నారు. ఈ నేపథ్యంలో #వాల్మీకి, #బోయ సంఘం ప్రధాన కార్యదర్శి జక్కుల శ్రీనివాసరావు ఈ అంశంలో న్యాయం చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ ను ఆశ్రయించారని కాలవ తెలిపారు. పలుమార్లు సదరు విషయాన్ని విచారించిన కమిషన్ దీనిపై తదుపరి చర్యల కోసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించిందన్నారు. కాబట్టి ప్రస్తుత ఎన్.డి.ఏ. ప్రభుత్వం 2017 డిసెంబరులో చంద్రబాబు సర్కారు చేసిన తీర్మానానికి కట్టుబడి ఉందన్న విషయాన్ని వివరిస్తూ, కేంద్రానికి స్పష్టం చేయాలని కాలవ సి.ఎస్.ను కోరారు. ఈ మేరకు సాధ్యమైనంత త్వరగా సమాధానం పంపడంతో పాటు సదరు విషయాన్ని #జాతీయఎస్టీకమిషనుకు కూడా నివేదించాలని కాలవ శ్రీనివాసులు విన్నవించారు.